శ్రీనగర్: సమాచార మార్పిడిలో గోప్యతకు ఉగ్రవాదులు కొత్త దారులు వెతుకుతున్నారు. ఇప్పటికే వాట్సప్ వంటి యాప్లకు సంబంధించి వ్యక్తిగత సమాచార గోప్యత విధానంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా.. పాక్లోని ఉగ్రవాద గ్రూపులు, ఉగ్రముఠాలు ఫేస్బుక్, వాట్సాప్లను వాడటం మానేశాయి. ఇవన్నీ కొత్త రకం మెసేజింగ్ యాప్లను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భారత భద్రత దళాల నిఘా నుంచి తప్పించుకునేందుకు 3 సరికొత్త యాప్లను ఉగ్రవాద గ్రూపులు వినియోగిస్తున్నట్లు తేలింది. ఈమేరకు అధికారులు వాటి వివరాలను సేకరించారు. ఈ కొత్త యాప్లలో.. ఒకటి అమెరికాకు చెందిన ఓ కంపెనీది కాగా, మరొకటి యూరప్ది. తాజాగా బయటపడిన మూడోది టర్కిష్ కంపెనీ రూపొందించిందిగా గుర్తించారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు కొత్తగా చేర్చుకోబోయే వారితో చర్చించడానికి ఈ టర్కీ యాప్ను తరచుగా వాడుతున్నట్లు సమాచారం. భద్రత కారణాల రీత్యా ఈ 3 కొత్త యాప్ల పేర్లను అధికారులు బయటపెట్టలేదు.
సులువుగా అందుబాటులోకి..
2019లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం జమ్మూ-కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తిరిగి గత ఏడాది 2జీ సేవలను మాత్రం పునరుద్ధరించారు. ఈ మేరకు ఉగ్రవాదులు వినియోగిస్తున్న కొత్త యాప్లలో.. ఇంటర్నెట్ వేగం నెమ్మదిగా ఉన్నప్పటికీ సమర్థంగా పనిచేసే సాంకేతికతను వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. 2జీ నెట్వర్క్ వినియోగించే రోజుల్లో వాడిన సాంకేతికతతోనే ఇవి పనిచేసేలా రూపొందించినట్లు సమాచారం. ఈ కొత్త యాప్లు కనీసం వినియోగదారుల ఫోన్ నంబర్, ఈమెయిల్ కూడా అడగవు. అందువల్ల వారి వివరాలు ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్లో ఇలాంటి యాప్లను నిషేధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.