భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు.
భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవుదినాల్లో ఇది కూడా ఒకటి. ఇది కాక భారత స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి మిగిలిన రెండు జాతీయ సెలవులు.
1950 జనవరి 26 న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. 1946 నుంచి 1949 వరకూ ఈ బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ఆ రోజును స్వాతంత్ర్య దినోొత్సవంగా వ్యవహరించారు. ఐతే దేశ స్వాతంత్ర్య దినం బ్రిటీషర్లు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహిస్తూంటారు. జనవరి 26 తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు. దేశరాజధాని న్యూఢిల్లీలో జెండా ఎగరేసి ప్రసంగిస్తారు. విశాలమైన గ్రౌండ్ లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను, ప్రభుత్వ శాఖలను ప్రతిబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరేడ్ చేయిస్తారు. 2015 గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు పాల్గొనడం ఇదే తొలిసారి.
- 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర శకటం తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో పాలుపంచుకొంది.
- సైనిక, వాయు, నౌకా దళాలకు చెందిన పూర్తిస్థాయి మహిళా దళాలు రాజ్పథ్లో కవాతు చేశాయి.
- తీర ప్రాంత రక్షణ, జలాంతర్గాములను పేల్చివేసే శక్తిగల పీ-81, అడ్వాన్స్డ్ ఎయిర్ ఫైటర్ ఎంఐజీ-29 కే యుద్ధ విమానాలు పెరేడ్లో పాల్గొన్నాయి.
- నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న సీఆర్పీఎఫ్ కమాండో దళమైన కోబ్రా బెటాలియన్ కవాతులో తొలిసారిగా పాల్గొంది