నేడు రక్షణమంత్రి మీడియా సమావేశం
దిల్లీ: తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించుకునే అంశంపై భారత్, చైనా మధ్య దాదాపు రెండున్నర నెలల తర్వాత మళ్లీ చర్చలు జరిగాయి. చైనా భూభాగంలోని మోల్దో సరిహద్దు శిబిరం వేదికగా ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలైన ఈ చర్చలు.. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు సాగాయి.
ఘర్షణకు కేంద్ర బిందువుగా ఉన్న అనేక ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపైనే ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు ప్రధానంగా చర్చించారు. బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతల సడలింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన తొలి బాధ్యత చైనాపైనే ఉందని భారత మరోసారి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా చర్చలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.