దిల్లీ: బ్రిటన్లో బయటపడిన కొత్తరకం కరోనా వైరస్తో ప్రపంచ దేశాలు మరోసారి వణికిపోతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు బ్రిటన్ నుంచి విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా బ్రిటన్కు విమాన రాకపోకలపై తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. తాజాగా బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన వారిలో కరోనా వైరస్ నిర్ధారణ అవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఇప్పటివరకు బ్రిటన్లో బయటపడిన కొత్తరకం వైరస్ భారత్లో గుర్తించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి గతకొద్దిరోజులుగా వివిధ రాష్ట్రాలకు భారీ సంఖ్యలో ప్రయాణికులు వచ్చినట్లు తెలుస్తోంది. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ సహాయంతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 22వ తేదీ వరకు యూకే నుంచి భారత్ వచ్చిన వారందరి వివరాలను సేకరిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. వారిలో ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లయితే వారి కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చేపడుతామని స్పష్టంచేశారు. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించే పనిలో ఆయా రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి.
దిల్లీ.. గడిచిన రెండు వారాల్లోనే యూకే నుంచి దిల్లీ విమానాశ్రయానికి దాదాపు 6నుంచి 7వేల మంది వచ్చినట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. వారందరినీ ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. యూకే నుంచి వచ్చిన వారందరినీ హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే, నిన్న దిల్లీ విమానాశ్రయంలో చేసిన కొవిడ్ పరీక్షల్లో యూకే నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ముంబయి.. యూకే నుంచి భారత్ వచ్చిన ప్రయాణికుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. యూకే నుంచి ముంబయికి మూడు విమానాల్లో ఈరోజు 591 మంది ప్రయాణికులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వారిలో కరోనా లక్షణాలు లేవని తెలిపారు. వీరిలో 299మందిని వివిధి హోటళ్లలో క్వారంటైన్ చేయగా.. మరో 292 మందిని విమానాశ్రయంలోనే ఉంచారు. వీరిని ఏడు రోజుల పాటు వారి సొంత ఖర్చులతోనే తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచుతామని ముంబయి మునిసిపల్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.
కోల్కతా.. సోమవారం రాత్రి యూకే నుంచి కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్కు వచ్చిన విమానంలోని ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. దీంతో వారిని సంస్థాగత క్వారంటైన్కు పంపారు. అయితే, గడిచిన 15రోజుల్లో యూకే నుంచి పశ్చిమ బెంగాల్ వచ్చిన వారి వివరాలను సేకరించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించే పనిలో బెంగాల్ అధికారులు నిమగ్నమయ్యారు.
బెంగళూరు.. కేంద్ర ప్రభుత్వ సూచనలతో అటు కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ మధ్యకాలంలో బ్రిటన్ నుంచి బెంగళూరుకు వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించే పనిలో పడింది. కేవలం నిన్న ఒక్కరోజే రెండు విమానాల్లో దాదాపు 587 మంది ప్రయాణికులు బెంగళూరు చేరుకున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం వీరిలో ఒకరిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించారు. వారి కాంటాక్టు ట్రేసింగ్ చేస్తున్నట్లు తెలిపారు.