బిడ్డకున్న వైకల్యం ఆమె గుండెను బద్దలుచేస్తే... భర్త మరణం ఆమె జీవితాన్ని అగాథంలోకి నెట్టేసింది.. దాంతో ఐదుగురున్న కుటుంబానికి తానే పెద్దదిక్కయింది. కఠిన పరిస్థితులను ఎదుర్కోడానికి మహిళలు అరుదుగా ఉండే ఆ పనిని ఎంచుకుంది ఆమె. చేసే పని దైవంతో సమానం అంటారు. గడ్డు పరిస్థితుల్లో సావిత్రికి కులవృత్తే దైవమైంది. కష్టాలు తీరడం కోసం ఆమె ఎంచుకున్న ఈ వృత్తి ఆమెకు ఓ అరుదైన గుర్తింపును తీసుకొచ్చింది. తెలంగాణలో కల్లుగీత కార్మికురాలిగా ప్రభుత్వ లైసెన్సు పొందిన అయిదుగురు మహిళల్లో ఒకరిగా నిలిచింది...
సావిత్రిది మెదక్ జిల్లా రేగోడ్. సాధారణ కుటుంబం. పదో తరగతి వరకు చదువుకుంది.
2011లో అదే గ్రామానికి చెందిన గీత కార్మికుడు సాయాగౌడ్తో పెళ్లయింది. ఇంట్లో వారికితోడు అత్త,మామలున్నారు.

రేపటిపై ఆశ తప్ప... పెద్దగా ఆస్తిపాస్తులేవీ లేవు. ఉన్నదాంట్లో కలోగంజో తాగుతూ చీకూచింతాలేకుండా గడిపేస్తున్నారు.
ఇంతలో సావిత్రికి పాప పుట్టింది. ఆమె దివ్యాంగురాలు. మొదట్లో బాధపడ్డా తర్వాత ఆ దంపతులు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొన్నారు. బిడ్డను కష్టపడి ప్రయోజకురాలిని చేద్దాం అని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం సాయాగౌడ్ ఇంకా ఎక్కువ ఉత్సాహంగా కష్టపడేవాడు.
ఇంతలో దేవుడు ఆ కుటుంబానికి కోలుకోలేని కష్టాన్నిచ్చాడు...
2016లో ఓ రోజు... అప్పుడు సావిత్రి నాలుగు నెలల గర్భిణి.సాయంత్రం అలిసిపోయి ఇంటికి వచ్చిన భర్త తొందరగా నిద్రలోకి జారుకున్నాడు...ఇక ఆయన లేవలేదు. గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూశాడు.

మరి బతుకుతెరువు ఏంటి? అప్పుడప్పుడు తన భర్తతోపాటు ఈత చెట్ల దగ్గరకు వెళ్లిన రోజులను గుర్తు చేసుకుంది. అప్పుడాయన చేస్తున్న పనిని శ్రద్ధగా గమనించేది. అవగాహన ఉన్న ఆ పనినే చేద్దామని ఆమె నిర్ణయించుకుంది.
అప్పటికే గీత కార్మికుడిగా భర్తకు ప్రభుత్వం జారీ చేసిన లైసెన్సు ఉంది. గీత గీయాలంటే తనకూ లైసెన్సు కావాలి.
దానికోసం అబ్కారీశాఖ ఉన్నతాధికారులను సంప్రదించింది. కొన్నాళ్లు తర్జన భర్జన పడ్డ అధికారులు చివరకు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుని శిక్షణనిచ్చారు. అనంతరం పెట్టిన పరీక్షలో ఆమె ఉత్తీర్ణత సాధించడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోనే తొలి గీత కార్మికురాలిగా ధ్రువీకరణ పత్రం అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆమె రోజూ పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 30 ఈత చెట్ల నుంచి కల్లు తీస్తుంది.