వచ్చేవారం ఆస్ట్రాజెనికా టీకాకు అనుమతి?


వచ్చేవారం ఆస్ట్రాజెనికా టీకాకు అనుమతి?

దిల్లీ: కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్‌ను అత్యంత త్వరలో దేశంలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే వచ్చే వారం ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాకు అత్యవసర వినియోగం కింద కేంద్రం అనుమతులు మంజూరు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ విషయాన్ని రాయిటర్స్‌ కథనం వెల్లడించింది. టీకాపై అధికారులు కోరిన అదనపు సమాచారాన్ని తయారీ సంస్థలు ప్రభుత్వానికి అందించాయని, వచ్చే వారం అనుమతులు మంజూరయ్యే అవకాశముందని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు తెలిపినట్లు పేర్కొంది. 

కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ భారత్‌ బయోటెక్‌, సీరం ఇనిస్టిట్యూట్‌, ఫైజర్‌ సంస్థలు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఫైజర్‌ టీకా ధర ఎక్కువగా ఉండటంతో పాటు దాన్ని భద్రపరిచేందుకు అతిశీతల ఉష్ణోగ్రతలు కావాల్సినందున కేంద్రం దాని వైపు మొగ్గుచూపట్లేదని తెలుస్తోంది. ఇక ఆస్ట్రాజెనెకా విషయానికొస్తే, భారత్‌కు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌.. ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనెకాతో కలిసి ఈ వ్యాక్సిన్‌ను తయారుచేస్తోంది. దీని ధర తక్కువగా ఉండటంతో పాటు సాధారణ ఫ్రిజ్‌ ఉష్ణోగ్రతల్లో సుదీర్ఘకాలం భద్రపరిచే వీలుండటం, రవాణాకు అనుకూలంగా ఉండటంతో అనుమతులు మంజూరు చేసే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

టీకా అనుమతి కోసం వచ్చిన మూడు దరఖాస్తులను సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఈ నెల 9న పరిశీలించింది. అయితే వ్యాక్సిన్‌లపై మరింత సమాచారం ఇవ్వాలని తయారీ సంస్థలను కోరింది. దీంతో సీరమ్‌ ఇటీవల ఆ సమాచారాన్ని కేంద్రానికి సమర్పించినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఫైజర్‌, భారత్‌ బయోటెక్‌ల నుంచి అదనపు సమాచారం రావాల్సి ఉంది. అయితే, అన్ని కంపెనీల వివరాలను వచ్చిన తర్వాతే వ్యాక్సిన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫైజర్‌ టీకాకు యూకే, అమెరికాలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అమెరికాలో మోడెర్నా టీకాకు కూడా అనుమతులు మంజూరయ్యాయి.

కాగా.. భారత్‌లో కరోనా కేసులు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టినప్పటికీ దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి దాటింది. 1.45లక్షల మందికి పైనే వైరస్‌కు బలయ్యారు. దీంతో టీకాను త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. టీకా సామర్థ్యం, భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో దేశంలో టీకా పంపిణీ ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. తొలి విడతలో భాగంగా రానున్న 6-7 నెలల్లో దేశవ్యాప్తంగా 30కోట్ల మందికి టీకా వేయాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. 

ఇదిలా ఉండగా.. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ వెలుగుచూసిన నేపథ్యంలో భారత్‌ సహా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌ నుంచి తాజాగా మన దేశానికి చేరుకున్న విమాన ప్రయాణికుల్లో 25 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడం ఆందోళక కలిగిస్తోంది. వారికి సోకింది కొత్త వైరస్‌ రకామా? కాదా? అన్నది తేలాల్సి ఉంది. 

Post a Comment

Previous Post Next Post