కోస్తాజిల్లాల్లో ఇతర కులాలకు చెందిన అభిమానులతో పాటు కాపు కులాన్ని చూసుకుని, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారనేది నిర్వివాదాంశం. ఆయన రాజకీయాభిమానుల్లో అత్యధిక శాతం కాపు సామాజిక వర్గమే. మొన్న వచ్చిన ఆరు శాతం ఓట్లలో 80 శాతానికి పైబడి కాపు ఓట్లే.
తప్పులేదు. స్వకులమైన కాపు ఓట్లను నమ్ముకుని రాజకీయాల్లోకి దిగడంలో తప్పు లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో 35 అసెంబ్లీ సీట్లు, 5 ఎం.పి సీట్లు ఉన్నాయి. రాయలసీమలోని 52 అసెంబ్లీ సీట్లలో 30 వరకు బలిజలు ( కాపులు) ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నారు.
కాపుల పార్టీ అయిన జనసేనలోకి ,కమ్మ ప్రముఖుడైన నాదెండ్ల మనోహర్ను పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. ఎన్ టీ రామారావు గనుక లక్ష్మీపార్వతిని వెంటేసుకు తిరిగినట్టు; పవన్ కళ్యాణ్ - తన మిత్రుడిని అయిన దానికీ, కాని దానికీ వెంటేసుకు తిరగడం కాపు సమాజానికి అసలు సహించడం లేదు.
జనసేన అభిమానులు, కార్యకర్తలం అనుకునేవారు, నాయకులలో అత్యధికులు లోపల్లోపలే ఉడికిపోతున్నారు. కడుపు చించుకుంటే....కాళ్ళమీద పడుతుందన్న ఆవేదనతో నోరు మెదపలేక పోతున్నారు. ఇంకో మూణ్ణెళ్ళు ఆగితే, జనసేన పెట్టి ఏడేళ్లు అవుతుంది.
ఈ పూటకీ జిల్లాల్లో పార్టీ కమిటీలు లేవు. ఒక ప్రణాళికాబద్ధమైన పార్టీ కార్యకలాపాలు లేవు. ఆయన లెప్టా...రైటా అనేదాంట్లో స్పష్టత లేదు. స్వంతంగానే బీజేపీ వైపు చూస్తున్నారా- లేక- తెలుగు దేశం వ్యూహంలో భాగంగా బీజేపీ వైపు చూస్తున్నారా అనేది తెలియడం లేదు. సరైన రాజకీయ సలహాదారులు లేరు. ఆ పార్టీకి పనిచేసే కార్యవర్గం లేదు. జనసేన అనగానే-కనపడుతున్నదల్లా పవన్ కళ్యాణ్, ఆయన పక్కన నాదెండ్ల మనోహర్.
నాదెండ్ల విషయంలో - పవన్ కళ్యాణ్ ,బొమికలు మెళ్ళో వేసుకు తిరుగుతున్నారని కోస్తాలోని జనసేన అభిమానులు( అంటే కాపులు వగైరా) గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ఆ విషయాన్ని బల్ల గుద్ది చెప్పడానికి వాళ్లేమీ మొహమాటపడుతున్నట్టు కూడా లేదు.
కోస్తాలో కాపులకు- కమ్మలకు మధ్య- 'సామాజిక సదభిప్రాయంస లేదు అనేది బహిరంగ రహస్యం. తాము రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా సంఘటితం కావడం కమ్మలకు ఇష్టం లేదని కాపు కులపెద్దలు అనేక మంది బాహాటంగానే అభిప్రాయపడుతుంటారు.
విజయవాడలో కాపు కులస్తుడైన వంగవీటి మోహన రంగాను హత్య చేయించింది కమ్మలే అనేది కాపుల దృఢ అభిప్రాయం. రంగాను ఇలాగే వదిలేస్తే, ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి అయిపోతాడన్న 'భయం' తోనే, ఆయనను ఎలిమినేట్ చేశారని ఆనాటి పరిస్థితికి ప్రత్యక్ష సాక్షులైన కాపు ప్రముఖులు ఇప్పటికీ చెబుతుంటారు.
కాపుల ఓట్లు కొల్లగొట్టి, వారిని చంద్రబాబు నిలువునా మోసం చేశారని కాపులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ కు తెలియంది కాదు. ఈ రకంగా కోస్తాలో కాపులు- కమ్ముల మధ్య నడిచే 'కోల్డ్ వార్' ను గమనించనట్టుగా....కాపు నేత అయిన పవన్ కళ్యాణ్; కమ్మ నేత అయిన నాదెండ్ల మనోహర్ను పార్టీ పరంగా- వెంటేసుకుని తిరగడం- పవన్ అభిమాన లోకాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.
స్నేహం వేరు- రాజకీయం వేరు. వీరి స్నేహం- ప్రైవేట్ వ్యవహారం. పార్టీలో వీరి ప్రయాణం- పబ్లిక్ వ్యవహారం. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గమనించాలనే- ఆయనను రాజకీయంగా బలపరిచే కాపులు కోరుకుంటున్నారు. కానీ, ఆయన గమనించడం లేదు.
ఉదాహరణకు- తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన రామ్మోహన్ను ఆర్భాటంగా పార్టీలోకి ఆహ్వానించి, శాలువా కప్పి, 'పార్టీ అధ్యక్షుడికి సలహాదారు' అని ప్రకటించారు. ఆయన సలహాను పవన్ కళ్యాణ్ తీసుకుని ఎంతకాలమైంది?
మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐఏఎస్. అధికారి తోట చంద్రశేఖర్ను పార్టీ ప్రధాన కార్యదర్శి అని ప్రకటించారు. ఆయనతో సమావేశమై ఎంతకాలం అయింది? నెల్లూరులో ఉన్న మాదాసు గంగాధరంను తీసుకొచ్చి, పార్టీ ప్రధాన కార్యదర్శి అన్నారు. ఆయనతో మాట్లాడి ఎంత కాలం అయింది?
ఈ రకంగా ప్రస్తావించుకుంటూ పోతే...అదో చాంతాడంత జాబితా అవుతుంది. వీరందరినీ వదిలేసి - కమ్మ అయిన 'నాదెండ్ల మనోహర్తోనే నా రాజకీయం' అనుకుంటూ పవన్ ,రాజకీయ ప్రయాణం సాగించినంత కాలం- ఆయన- తన ప్రధాన ఓట్ బ్యాంక్ విశ్వాసాన్ని చూరగొనలేరు