వట్పల్లి, న్యూస్టుడే: ఆహారం వికటించి ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు, వారి వదిన మృతిచెందిన ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లాలో జరిగింది. తల్లి చనిపోయిన పదిరోజుల వ్యవధిలోనే జరిగిన ఘటనతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. స్థానికుల కథనం ప్రకారం..
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పల్వట్ల గ్రామానికి చెందిన మఠం శంకరమ్మ(80) ఈ నెల 13న వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మృతిచెందారు. ఈ నెల 17న ఆమె దశదినకర్మ క్రతువులు పూర్తిచేసిన కుటుంబ సభ్యులు అనంతరం ఆలయంలో నిద్ర చేసేందుకు వెళ్లారు. 21న మృతురాలి కుమారుడు మఠం చంద్రమౌళి(55), ఆయన భార్య అనసూయ(50), మరో కుమారుడు మఠం శ్రీశైలం(48), ఆయన భార్య సరిత(35), పెద్ద కోడలు సుశీల(60) సహా వారి పిల్లలు ఇంటికి తిరిగొచ్చారు. మధ్యాహ్నం ఇంట్లో ఉన్న జొన్న పిండితో రొట్టెలు, పప్పు దినుసులతో కూరలు, అన్నం వండుకున్నారు. చంద్రమౌళి, శ్రీశైలం, అనసూయ, సరిత, సుశీల జొన్న రొట్టెలు తినగా, పిల్లలు అన్నం తిన్నారు. జొన్న రొట్టెలు తిన్న అనంతరం ఐదుగురూ వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురై ఇంట్లోనే పడిపోయారు. బాధితులను స్థానికులు 108 వాహనంలో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుశీల, చంద్రమౌళిల పరిస్థితి విషమించినట్టు గుర్తించిన వైద్యులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ సోమవారం రాత్రి మృతిచెందారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీశైలం మరణించారు. అనసూయ, సరిత ప్రస్తుతం హైదరాబాద్లోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తల్లి మృతిచెందిన వారం రోజుల్లోనే అదే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పది రోజుల కిందట జరిగిన శంకరమ్మ మరణం సహా తాజాగా ముగ్గురు మరణించేందుకు జొన్నపిండే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తంచేశారు. జిల్లా వైద్యాధికారి మోజీరాంరాథోడ్ జొన్నపిండితోపాటు పప్పు దినుసులను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్కు పంపారు.